సింగిల్-యూజ్ ప్లాస్టిక్కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
జమ్మికుంట టౌన్ జులై 14 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణాన్ని సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వారసంతతో పాటు ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే తీవ్ర నష్టాలపై అవగాహన కల్పించారు.
తనిఖీల సందర్భంగా సానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ మాట్లాడుతూ, పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఇతర నిషేధిత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని సూచించారు. ప్లాస్టిక్కు బదులుగా వస్త్ర సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని వ్యాపారులను కోరారు.
వ్యాపారులకు మార్పు కోసం వారం రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కూడా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం కొనసాగిస్తే సంబంధిత దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్తో పాటు జవాన్ కిరణ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
.


Comments