శివకృప కోసం భక్తుల రద్దీ ఘనంగా రుద్రాభిషేకాలు.

ఎల్కతుర్తి , జూలై 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శివకృప కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఉదయం వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పంచామృత సహిత మహా రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, విశేష అర్చనలు, మహామంగళహారతి ఘనంగా నిర్వహించారు. అనంతరం నైవేద్య సమర్పణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారుమోగగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర రోజున రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.


Comments