ఎస్ఐఆర్ ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలి.
సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం.
పెద్దమందడి,జూలై13(తెలంగాణ ముచ్చట్లు):
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను గ్రామంలో వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మధిర మంజుల శ్రీశైలం బూత్ లెవల్ అధికారులకు సూచించారు.సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్వారీగా పరిశీలించిన ఆమె, గ్రామంలో మొత్తం నాలుగు పోలింగ్ బూత్లు (78, 79, 80, 82) పరిధిలో 2,035 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 1,602 మంది ఓటర్ల వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 78 శాతం నమోదు పూర్తైందని, మిగిలిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి వారం రోజుల్లోనే గ్రామాన్ని 100 శాతం నమోదు లక్ష్యానికి చేర్చాలని ఆదేశించారు.బూత్వారీగా పురోగతిని పరిశీలించగా, బూత్ నంబర్–78లో 840 మంది ఓటర్లకు గాను 637 మంది, బూత్ నంబర్–79లో 693 మందికి గాను 534 మంది, బూత్ నంబర్–80లో 324 మందికి గాను 296 మంది, బూత్ నంబర్–82లో 178 మందికి గాను 135 మంది ఓటర్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు వెల్లడైంది.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దరఖాస్తును సకాలంలో పూర్తి చేసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని బీఎల్వోలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి, బీఎల్వోలు లక్ష్మి, బీఎల్ఏ కొంకలి నరసింహతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


Comments