హుజురాబాద్లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం.
హుజురాబాద్, జూలై 11 (తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలో శనివారం రాత్రి పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ ప్రధాన రహదారిపై పాపయ్యపల్లి క్రాస్రోడ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పెట్రోల్ నిల్వ ప్రాంతానికి మంటలు వ్యాపించకుండా సకాలంలో చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు.
పెట్రోల్ బంక్ యజమాని చొక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం, బంక్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో షార్ట్సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి పరిస్థితిని పరిశీలించారు.
ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తతను స్థానికులు అభినందించారు.


Comments