వ్యవసాయ సాగు సీజన్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి: పుల్లూరి స్వప్న సదానందం.
జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సూచించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా కొనుగోలు బిల్లులను భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎరువుల దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్ణీత ధరలకే ఎరువులను విక్రయించాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణాల్లో ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించి, తగిన నిల్వలను ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రైతులు, వ్యాపారులు పరస్పర సహకారంతో ఈ వ్యవసాయ సీజన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Comments