కోరపల్లి జడ్పీహెచ్ఎస్లో మౌలిక వసతులపై సమగ్ర సోషల్ ఆడిట్.
- పాఠశాల మౌలిక వసతులు, బోధన, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల సంక్షేమంపై సమగ్ర తనిఖీ
జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం కోరపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ ఆడిటర్ గజ్జల రవీందర్ పాఠశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షుణ్ణంగా పరిశీలించి పలు అంశాలపై వివరాలను సేకరించారు.
పాఠశాలలో తరగతి గదులు, ఫర్నిచర్, తాగునీటి, రన్నింగ్ వాటర్, మరుగుదొడ్ల సౌకర్యాలు, విద్యుత్ వసతులు, ఆటస్థలం, ప్రహరీ గోడ, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, గణిత కిట్, ఐఎఫ్బీ ప్యానెల్ బోర్డుల వినియోగం, హ్యాండ్వాష్ సదుపాయాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ, స్కాలర్షిప్లు, రవాణా సౌకర్యం, హాజరు శాతం, డ్రాప్ఔట్ విద్యార్థుల వివరాలు, గ్రీవెన్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి అంశాలపై సమగ్ర సమాచారం నమోదు చేశారు.
అదనంగా ఉపాధ్యాయులు, ఏఏపీసీ చైర్పర్సన్ బండారి రజిత, తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, క్లబ్ల నిర్వహణ, బోధన విధానాలపై కూడా వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను అంచనా వేసి అవసరమైన మెరుగుదలలు చేపట్టేందుకు ఇలాంటి సోషల్ ఆడిట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సెస్ బృందం సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు.


Comments