హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం.
రోడ్డు ఇరువైపులా 400 మొక్కలు నాటిన సర్పంచ్ బత్తిని రవీందర్.
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):
హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బావుపేట నుంచి గుంటూరుపల్లె వరకు సుమారు 400 మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బత్తిని రవీందర్ మాట్లాడుతూ, పచ్చదనమే గ్రామాభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి మూలాధారమని అన్నారు. మొక్కలు మానవ మనుగడకు ప్రాణవాయువును అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేటి అవసరాల కోసం చెట్లను నరికివేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.
రోడ్ల వెంట మొక్కలు పెరగడం వల్ల ప్రయాణికులకు నీడ లభించడంతో పాటు గ్రామ సౌందర్యం పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. పండ్ల చెట్ల పెంపకంతో పక్షులు, ఇతర జీవరాశులకు ఆహారం లభించడమే కాకుండా కోతుల బెడద కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.
నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వాటికి క్రమం తప్పకుండా నీరు అందించి చెట్లుగా పెరిగే వరకు పర్యవేక్షిస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Comments