నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.
ప్రభుత్వంపై మిట్టపల్లి సురేందర్ ఆగ్రహం.
హుజురాబాద్, జూలై 5 (తెలంగాణ ముచ్చట్లు):
నియోజకవర్గ కేంద్రంగా, వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై కీలక పట్టణంగా ఉన్న హుజురాబాద్లో తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు గత కొన్ని నెలలుగా నిలిచిపోవడంపై కరీంనగర్ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మిట్టపల్లి సురేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నెలలు గడుస్తున్నా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. హుజురాబాద్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు పార్సిళ్లు, వస్తువుల రవాణా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కార్గో సేవలు నిలిచిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని, ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఇలాంటి పరిస్థితి కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
హుజురాబాద్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను తక్షణమే పునరుద్ధరించాలని మిట్టపల్లి సురేందర్ డిమాండ్ చేశారు.


Comments