ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్.
సత్తుపల్లి, జూలై 6 (తెలంగాణ ముచ్చట్లు):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్, ఎన్నికల అధికారి అజయ్ యాదవ్ బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) ఆదేశించారు. సోమవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులోని 190వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం తీరును సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల నమోదుతో పాటు 2002 ఓటరు జాబితాలో ఉన్న, లేని వారి వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అలాగే బీఎల్వోల వద్ద ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఎస్ఐఆర్ కార్యక్రమానికి అందిస్తున్న సహకారంపై కూడా ఆరా తీశారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి తిరిగి స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, అందుబాటులో లేని ఓటర్ల ఇళ్లను మరోసారి సందర్శించి వారి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో బీఎల్వో మల్లీశ్వరి, సూపర్వైజర్ వెంగళరావు, బీఎల్ఏ మల్లెల్లి అనిల్, ఎన్నికల పరిశీలకుడు మధు పాల్గొన్నారు.


Comments