వనపర్తి అభివృద్ధికి రూ.2,147 కోట్ల ముద్ర.. పేదలకు రూ.79.89 కోట్ల చేయూత.
వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి .
వనపర్తి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):
గత 30 నెలల కాలంలో వనపర్తి నియోజకవర్గంలో రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా 13,167 మంది లబ్ధిదారులకు రూ.79.89 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్), కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 7,371 మందికి రూ.18.05 కోట్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకం కింద 5,385 మందికి రూ.53.91 కోట్లు, ఎల్ఓసీ పథకం ద్వారా 411 మందికి రూ.7.92 కోట్ల వైద్య సహాయం అందించినట్లు వివరించారు.ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అధికార దుర్వినియోగం పెరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments