గ్రామపంచాయతీ ట్రాక్టర్ వినియోగంపై ఆరోపణలు..
నిజానిజాలు తేల్చాలని గ్రామస్థుల విజ్ఞప్తి.
పెద్దమందడి,జూలై10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్, వాటర్ ట్యాంక్, అలాగే సిబ్బందిని వ్యక్తిగత నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.స్థానికుల కథనం ప్రకారం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో చేపడుతున్న నిర్మాణ పనుల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా సిమెంట్ రవాణా చేయడంతో పాటు, గ్రామ వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా, పంచాయతీ సిబ్బందిని కూడా ఆయా పనులకు వినియోగిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వార్డ్ సభ్యుడు బ్రహ్మయ్య తెలిపారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన గ్రామపంచాయతీ వనరులను వ్యక్తిగత పనులకు ఉపయోగించినట్లయితే సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
*ఈ అంశంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా* ..
తాను ప్రస్తుతం జిల్లా కేంద్రంలో శిక్షణ (ట్రైనింగ్)లో ఉన్నందున అందుబాటులో లేనని, ఈ వ్యవహారంపై తనకు పూర్తి సమాచారం లేదని తెలిపారు.పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం స్పందిస్తానని పేర్కొన్నారు.


Comments