గౌడ సంఘం ఆస్తుల ధ్వంసంపై ఫిర్యాదు.. విచారణకు ఎక్సైజ్ శాఖ హామీ.
జమ్మికుంట టౌన్ జూలై 11 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట గౌడ సంఘానికి చెందిన నంబర్ దుకాణం పరిధిలో ఉన్న తాటి, ఈత చెట్లను అక్రమంగా జేసీబీతో తొలగించారని ఆరోపిస్తూ గౌడ సంఘం ప్రతినిధులు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసి, జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
గౌడ సంఘం ప్రతినిధుల కథనం ప్రకారం, ఒడ్డెరి కొమురయ్య అలియాస్ శివరాత్రి కొమురయ్య అనే వ్యక్తి జేసీబీతో సంఘానికి సంబంధించిన భూమిలో ఉన్న సుమారు 40 ఈత చెట్లు, 10 తాటి చెట్లను పీకివేశారని తెలిపారు. ఈ ఘటన వల్ల సంఘానికి నష్టం వాటిల్లిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదును స్వీకరించిన ఎక్సైజ్ సీఐ, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని తెలిపారు. విచారణలో వాస్తవాలు నిర్ధారణ అయిన వెంటనే నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, సంఘానికి చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Comments