నీటి సంరక్షణే భావితరాల రక్షణ.. జమ్మికుంటలో జల ప్రతిజ్ఞ.
జమ్మికుంట టౌన్ జూలై 13 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో "జల్ శక్తి అభియాన్ – వర్షాన్ని పట్టుకోండి" కార్యక్రమంలో భాగంగా సోమవారం నీటి సంరక్షణపై జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది నీటి సంరక్షణకు అంకితమవుతూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, నీటిని పొదుపుగా, తెలివిగా వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రతి నీటి చుక్కను అమూల్యమైన వనరుగా భావించి దాన్ని వృథా కాకుండా కాపాడాలని, వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నీటిని మితంగా వినియోగించడం ద్వారానే భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. "ఈ గ్రహం మనది.. దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. జల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చుకుందాం" అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, టీపీఓ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments