శిథిలావస్థలో ఎస్సీ బాలుర హాస్టల్.. కొత్త భవనం నిర్మించాలని కలెక్టర్కు వినతి.
వనపర్తి,జూలై13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నాయకులు తెలిపారు. హాస్టల్కు వెంటనే నూతన భవనం నిర్మించి, అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్కు వినతిపత్రం సమర్పించారు.సుమారు 55 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని, గత ఎనిమిదేళ్లుగా కొత్త భవనం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. హాస్టల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని తెలిపారు. వర్షాకాలంలో గదుల్లోకి నీరు కారడం, పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడటం వల్ల విద్యార్థుల ప్రాణ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు హాస్టల్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే కొత్త భవనం మంజూరు చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి పరుశురాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ గంధం నాగరాజు, తాడిపత్రి మాజీ సర్పంచ్ జోగు శాంతన్న తదితరులు పాల్గొన్నారు.


Comments