చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం.
ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.
హుజురాబాద్, జూలై 13(తెలంగాణ ముచ్చట్లు ):
చిన్నారులను నలిపురుగుల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో సోమవారం జాతీయ నలిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఒక చిన్న మాత్ర... పిల్లల ఆరోగ్యానికి గొప్ప రక్షణ. నలిపురుగుల నివారణ మాత్ర ప్రతి చిన్నారి హక్కు – ప్రతి తల్లిదండ్రుల బాధ్యత" అని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర వేయించడం ద్వారా నలిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ మాత్రలను ఉచితంగా అందజేస్తోందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీటీసీవో హిమబిందు, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల, సీడీపీవో సుగుణ, మున్సిపల్ కౌన్సిలర్లు సునీత, శ్రీలేఖ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


Comments