అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా.
వనపర్తి,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాధమ్మ కుటుంబానికి సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తు ఆమె పండ్ల దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతై, వ్యాపారానికి సంబంధించిన పండ్లు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కుటుంబ జీవనాధారం ఒక్కసారిగా కోల్పోయిన రాధమ్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఈ ఘటన విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంగళవారం ఘటన స్థలానికి చేరుకుని కాలిపోయిన దుకాణాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకుని, బాధితురాలు రాధమ్మతో మాట్లాడి ఆమెను పరామర్శించారు. కుటుంబానికి ఇదే ఏకైక జీవనాధారమని తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాధమ్మ కుటుంబానికి జరిగిన నష్టం ఎంతో బాధాకరమని అన్నారు. జీవనోపాధిని కోల్పోయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం, ఇతర ప్రభుత్వ పరమైన సాయాలు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు.బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments