స్మార్ట్ కిడ్జ్ లో మొక్కలు నాటిన చిట్టి చేతులు.
నేడు చెట్టు నాటుదాం ..
రేపటి కోసం పచ్చని భవిష్యత్తుని నిర్మిద్దాం..!!
అంటూ నినదించిన స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు.
హాజరైన కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారి రాధిక
ఖమ్మం బ్యూరో,జూలై 17(తెలంగాణ ముచ్చట్లు )
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ఆవరణం శుక్రవారం చిట్టి చేతుల వన మహోత్సవ సంబరంలో మురిసిపోయింది. చిన్నారులు వనమహోత్సవ వేడుకను ఆనందోత్సవాలతో నిర్వహించారు. పాఠశాల చిన్నారులు పాఠశాల మైదానంలో, రహదారులకు ఇరువైపులా పలు రకాల మొక్కలను నాటారు. నీడనిచ్చే మొక్కలు, పండ్ల మొక్కలు, అందంగా పూలతో ఉండే మొక్కలు, తదితర వివిధ రకాల మొక్కలను నగరంలోని వేరువేరు ప్రాంతాలలో నాటారు. మొక్కలతో నగరంలో పాఠశాల విద్యార్థులు వనమహోత్సవ చైతన్య ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన విద్యార్థులు ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల గుండా నిర్వహించి ప్రజలను వనమహోత్సవం గురించి చైతన్యపరిచారు. పాఠశాలలో మొక్కల ప్రయోజనాలను వివరిస్తూ ఇద్దరు విద్యార్థులు ప్రదర్శించిన లఘు నాటిక అందరిని ఆలోచింపజేసింది. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య వనమహోత్సవ ర్యాలీని ప్రారంభించగా ఖమ్మం కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారిని రాధిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారిని రాధిక మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సంకల్పంతో నిర్వహించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా మనకు దీర్ఘకాలంగా ప్రాణవాయువు లభిస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు వనమహోత్సవాన్ని వేడుకోగా నిర్వహించడం ద్వారా ఇతర పాఠశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతంలోని పెరిగిన చెట్లు తమ పాఠశాల విద్యార్థులు గతంలో నాటిన మొక్కల వల్లనే ప్రయోజనం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి ముందు తమ పుట్టినరోజున తప్పనిసరిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. అనంతరం విద్యార్థులందరికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


Comments