ఎటువంటి బేషజాలు లేకుండా సీతారామ పనులు పూర్తి చేస్తాం .
మంత్రి పొంగులేటి.

ఖమ్మం బ్యూరో, జులై 16(తెలంగాణ ముచ్చట్లు )
సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... తమ ఇందిరమ్మ ప్రభుత్వం ఎటువంటి బేషజాలకు పోకుండా గత పాలకులు నిలిపివేసిన సీతారామ పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఈ కరువు కాలంలో కూడా ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన వివరించారు.
అనంతరం ఈ సమీక్షలో సీతారామ భూసేకరణ పనుల కోసం వెంటనే 135 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లులు సిద్ధం చేసి వెంటనే టోకెన్లు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. పనుల వేగాన్ని బట్టి ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు దివాకర టిఎస్, అంకిత్, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments