పేరుకే సన్నబియ్యం రేషన్ బియ్యంలో లక్కపురుగుల కలకలం.
ఎల్కతుర్తి, జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ సన్నబియ్యంలో లక్కపురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ, లబ్ధిదారులకు అందిన బియ్యం సంచుల్లో లక్కపురుగులు, పిండిపిండిగా మారిన బియ్యం కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం సంచులు తెరిచిన వెంటనే పురుగులు బయటకు వస్తున్నాయని, బియ్యం నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలాంటి బియ్యాన్ని తినడం వల్ల చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు సహా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ఇలాంటి ఘటనలు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పంపిణీకి ముందు సంబంధిత అధికారులు బియ్యం నాణ్యతను పరిశీలించకుండా నిర్లక్ష్యంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పురుగులు పట్టిన బియ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని, రేషన్ బియ్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Comments