ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రతి అర్హుడు నమోదు చేసుకోవాలి.
జమ్మికుంట టౌన్ జులై 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఓటు హక్కు కలిగిన వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పిలుపునిచ్చారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితా ఖచ్చితత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న స్వప్న సదానందం, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి కీలక బాధ్యత ఉందన్నారు. ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు తన వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.


Comments