విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
వేంసూరు ఎస్సీ బాలుర వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ.
వేంసూరు, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం వేంసూరులోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా విద్యార్థుల హాజరు, వసతి గదుల నిర్వహణ, భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్టాక్ రిజిస్టర్లు, మెస్ రికార్డులు, సంక్షేమ పథకాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. లోపాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన డిప్యూటీ డైరెక్టర్, వారికి అందుతున్న భోజనం, వసతి, విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, వసతిగృహంలో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు వసతిగృహ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మెరుగైన వసతి, విద్యా వాతావరణం కల్పించేందుకు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. తనిఖీలో సత్తుపల్లి అసిస్టెంట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం. వీరయ్య, కల్లూరు అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి గ్రేసమ్మ, వేంసూరు వసతిగృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments