దమ్మపేటకు సబ్కోర్టు మంజూరు చేయాలి.
- హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ వినతి.
- మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకానికీ విజ్ఞప్తి.
దమ్మపేట, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేటలో నూతన సబ్కోర్టు ఏర్పాటు చేసి, కోర్టులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చాలని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కోరారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె. శ్రీనివాసరావు, జస్టిస్ కె. శరత్లను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దమ్మపేట కోర్టులో ఎదురవుతున్న సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న కేసుల భారం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దమ్మపేటలో ప్రత్యేక సబ్కోర్టు మంజూరు చేయాలని కోరారు. కోర్టు భవనంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోర్టు ఆవరణలో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతిపై జస్టిస్ జె. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన వారిలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్రబాబు, హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్, ట్రెజరర్ తామ బాలరాజు, గేమ్స్ సెక్రటరీ తీర్నతి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


Comments