ఇందిరమ్మ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు..
విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించిన..
వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్..
ఖమ్మం బ్యూరో,జూలై 16(తెలంగాణ ముచ్చట్లు )
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంటి పై నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న విద్యుత్ వైర్ల తొలగింపు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కాలనీలో ఎన్ని కొత్త స్తంభాలు అవసరమవుతాయో, ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే విషయాలపై అధికారులు అంచనా (ఎస్టిమేట్) సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా కట్ల సంతోష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కాలనీలో ప్రతి గల్లీకి విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.
ఈ పరిశీలనలో విద్యుత్ శాఖ డీఈ రమేష్, ఏడీఈ కిరణ్, సబ్ ఇంజనీర్ నరేష్, లైన్ ఇన్స్పెక్టర్ జార్జ్, పాషా తదితరులు పాల్గొన్నారు.


Comments