ప్రజా సమస్యలపై.. పార్లమెంటులో గళం విప్పుతాం.
* రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
* కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన
* *సర్* ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
ఖమ్మం బ్యూరో,జులై 17(తెలంగాణ ముచ్చట్లు )
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
*అభివృద్ధి పనుల బాటలో..*
ఉదయం 54వ డివిజన్లో మసూద్ జయంతి నళని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రఘురాం రెడ్డి, అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లిలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే, కొత్తగూడెం, సుజాతనగర్, చంద్రుగొండ, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాల ప్రహరీ, ఆధునికీకరణ, నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. చంద్రుగొండలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. సాయంత్రం అశ్వారావుపేటలో సీనియర్ నాయకులు జేష్ట సత్యనారాయణ నివాసంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
*పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..*
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమేనని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుబంధు వంటి పథకాలతో ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయని వివరించారు.
*పార్లమెంట్ లో గళం విప్పుతాం..*
ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఎగువ, దిగువ సభల్లో ప్రజా సమస్యలపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పుతామని ఎంపీలు ఈ సందర్భంగా తెలిపారు.
*ఓటర్ల సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు*
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఎంతో కీలకమని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఎంపీలు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అధికారమే పరమావధిగా నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, ఓటర్ ఫారమ్లను జాగ్రత్తగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి జరుగుతున్న కృషిని కొనియాడుతూ, విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, డీసీసీ అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments