జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షుడిగా మిషేక్.. వాకింగ్తోనే ఆరోగ్యమని పిలుపు.
కొత్తకోట,జూలై20(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం ప్రతి వ్యక్తి రోజూ తప్పనిసరిగా వాకింగ్ చేయాలని జై భారత్ వాకింగ్ గ్రూప్ నూతన అధ్యక్షుడు జె.ఎం. మిషేక్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షుడిగా జె.ఎం. మిషేక్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మిషేక్ మాట్లాడుతూ..నేటి కాలంలో తాగే నీటి నుంచి తినే ఆహారం వరకు కలుషితమవుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నిత్యం వాకింగ్ చేయడం, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఉత్సాహం కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.2023లో జై భారత్ వాకింగ్ గ్రూప్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టానని, ప్రస్తుతం గ్రూపులో 21 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రతి ఉదయం అందరూ కలిసి వాకింగ్ చేస్తూ ఆరోగ్యంతో పాటు పరస్పరం సాధకబాధకాలు పంచుకుంటామని చెప్పారు. సభ్యుల్లో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసి వారి కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించడం గ్రూప్ ప్రత్యేకత అని వివరించారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులుగా కిషన్ నాయక్, ఈశ్వర్, ఉపాధ్యక్షుడిగా రామస్వామి, ప్రధాన కార్యదర్శులుగా వీరనరసింహాచారి, లక్ష్మయ్య, లక్ష్మయ్య బాబాయ్, కృష్ణయ్య గౌడ్, కోశాధికారిగా గంగాధర్ను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పదాధికారులను జె.ఎం. మిషేక్ అభినందించారు.ఈ కార్యక్రమంలో బాలరాజు, చంద్రయ్య, కురుమయ్య, భాస్కర్, సుల్తాన్, నాగరాజు, హన్మంత్ తదితర సభ్యులు పాల్గొన్నారు.


Comments