సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.
జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బస్వారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సీఎంఆర్ ధాన్యం నిల్వలు, సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
పౌరసరఫరాల శాఖ నుంచి మిల్లుకు వివిధ సంవత్సరాల్లో కేటాయించిన ధాన్యం పరిమాణం, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించిన బియ్యం వివరాలను అధికారులు రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వల్లో తేడాలు గుర్తించినట్లు సమాచారం. సంబంధిత అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిసింది.
ఈ తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, సీఐలు అనిల్, ప్రశాంత్రావు, రవీందర్, తహసీల్దార్ దినేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Comments