మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి.
ఎంపీ కడియం కావ్య.
హైదరాబాద్,జులై19(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హైదరాబాద్లో భారతీయ దేవాలయ వాస్తుశిల్పం, శిల్పశాస్త్రం, వారసత్వ పరిరక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగి రెడ్డితో ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన పలు డిజైన్ నమూనాలను పరిశీలించి, వాటిపై సవివరంగా చర్చించారు.
విమానాశ్రయం రూపకల్పనలో వరంగల్ చారిత్రక విశిష్టత, కాకతీయుల వారసత్వం స్పష్టంగా ప్రతిబింబించేలా డిజైన్ రూపొందించాలని సూచించారు. ఇందుకోసం కాకతీయుల నిర్మాణ శైలి, చారిత్రక కట్టడాల ప్రత్యేకతలు, వారసత్వ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచే వరంగల్ గొప్ప చారిత్రక, సాంస్కృతిక నగరమనే భావన కలిగేలా నిర్మాణ శైలి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కాకతీయ కళాతోరణం, వేయి స్తంభాల ఆలయం, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఆకృతులు, నమూనాలు విమానాశ్రయ నిర్మాణంలో పొందుపరచాలని సూచించారు.భవిష్యత్ తరాలకు కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని పరిచయం చేసే సాంస్కృతిక చిహ్నంగా మామునూరు విమానాశ్రయం నిలవాలని ఆకాంక్షించారు.


Comments