వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సూచన.
జమ్మికుంట టౌన్, జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సూచించారు. గురువారం పట్టణంలోని నాలుగో వార్డులో వర్షపు నీరు సజావుగా వెళ్లేలా మున్సిపల్ శానిటేషన్ బృందాలు చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వర్షాకాలంలో తాగునీటిని తప్పనిసరిగా గోరువెచ్చగా చేసి తాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పట్టణంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు కూడా పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములై మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ పోల్నేని అజయ్ రావు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments