తెలంగాణ జలసిరి పథకంపై రైతులకు అవగాహన.
వీణవంక, జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటి వనరులను కాపాడితేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత సాధ్యమవుతుందని డీఆర్డీవో మచ్చ గీత అన్నారు.
గురువారం వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ జలసిరి పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ జలసిరి పథకం ద్వారా భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి నిల్వ, సాగునీటి సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, చెక్డ్యాంలు, రీఛార్జ్ షాఫ్టులు వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సదస్సులో సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని జల సంరక్షణ చర్యలపై చర్చించారు.


Comments