అనారోగ్య బాధితులకు అండగా ఎమ్మెల్యే జారె.
- 278 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు అధికారులకు సమర్పణ.
- హార్ట్ సర్జరీ బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసీ అందజేత.
- ప్రజా సేవే శాశ్వతమని ఎమ్మెల్యే వ్యాఖ్య.
అశ్వారావుపేట, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించడంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మరోసారి చొరవ చూపారు. నియోజకవర్గానికి చెందిన 278 మంది అనారోగ్య బాధితుల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో సంబంధిత అధికారులకు స్వయంగా అందజేశారు. అదే రోజు అన్నపురెడ్డిపల్లి మండలం జానకిపురం గ్రామానికి చెందిన కట్టం రవి హృదయ శస్త్రచికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, చికిత్సకు అవసరమైన రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అందించారు. దీంతో బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక ఊరట లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసని చెప్పారు. పదవిలో లేకున్నా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, గతంలోనూ అనేక మందికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు


Comments