ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి.
వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్.
వనపర్తి,జూలై25(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ సూచించారు.శనివారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో నిర్వహించిన ఎల్నినో అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలను సంరక్షిస్తూ వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులు వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని తెలిపారు.కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి విజయభాస్కర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎంపీడీఓ, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


Comments