ఆరుతడి పంటల సాగుతో నష్టాలను నివారించండి.
ఏఈఓ కృష్ణయ్య.
పెద్దమందడి,జులై22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామంలో బుధవారం రైతులకు ఏఈఓ కృష్ణయ్య అవగాహన సమావేశం నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో ఏఈఓ కృష్ణయ్య పాల్గొని రైతులకు పంటల ఎంపికపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎల్నినో ప్రభావం కారణంగా రానున్న రెండు నెలల పాటు వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు.తక్కువ నీటితో సాగయ్యే జొన్న, కందులు, ఆముదం, మినుములు, పెసర్లు, అలసందలు, ఉలవలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు, ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ శాస్త్రీయ విధానంలో సాగు చేపట్టాలని రైతులకు జి. కృష్ణయ్య సూచించారు. సమావేశంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటల సాగుకు సంబంధించిన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


Comments