తెలంగాణ ప్రజల అగ్నిధార మహాకవి దాశరథి.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు
వనపర్తి,జూలై22(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధార గా మలిచి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని పదునైన ఆయుధంగా మలచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ప్రజల విముక్తి పోరాటానికి చిరస్మరణీయ స్ఫూర్తి అని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.బుధవారం స్థానిక రేడియంట్ హై స్కూల్లో సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పద్యాన్ని ప్రజా చైతన్యానికి, సామాజిక మార్పుకు ఆయుధంగా వినియోగించిన మహోన్నత కవి దాశరథి అని కొనియాడారు. బహుభాషా పండితుడైన ఆయన నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ఎదిరిస్తూ లాఠీ దెబ్బలు భరించడమే కాకుండా జైలు జీవితాన్ని కూడా అనుభవించారని తెలిపారు. తెలంగాణ నేలపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆయన ప్రతి రచనలో ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు.దాశరథి రచనలు పీడిత ప్రజల ఆవేదనకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచాయని, సమాజంలో చైతన్యం నింపే శక్తి ఆయన కవిత్వానికి ఉందన్నారు. నేటి యువత దాశరథి రచనలను అధ్యయనం చేసి ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు యాదవ్, బండారు శ్రీనివాస్, మద్దిలేటి, రమేష్తో పాటు ఉపాధ్యాయులు శైలజ, నుష్రత్, మైత్రీ, శోభ, కృష్ణవేణి, కల్యాణి, శ్రీదేవి, హేమలత, పుష్పాలత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


Comments