నీట్ బాధితులకు కొవ్వొత్తుల నివాళి.
హుజురాబాద్లో అఖిలపక్షం, ప్రజా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ.
హుజురాబాద్,జులై 25(తెలంగాణ ముచ్చట్లు ):
నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళిగా శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేశారు
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగిరావడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు. విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడితే అసాధ్యం అనుకున్న లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో నీట్తో పాటు అన్ని పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, పేపర్ లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు దేశ యువత శక్తిని చాటిచెప్పాయని, ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నూతన చైతన్యాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments