ప్రకటనలకే పరిమితమైన డయాలసిస్ సెంటర్.. ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు.
జమ్మికుంట టౌన్ జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ మంజూరు చేసినట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వైద్య పరికరాలు అందుబాటులోకి రాకపోవడంపై బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలకాని రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ, జమ్మికుంట మండలంలో సుమారు 70 మంది డయాలసిస్ రోగులు చికిత్స కోసం కరీంనగర్, హనుమకొండ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రయాణ ఖర్చులు, సమయాభావం, శారీరక ఇబ్బందులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ మంజూరు చేసినట్లు ప్రకటించడం మాత్రమే కాకుండా, వెంటనే అవసరమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఆలస్యం చేయకుండా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments