తొలి ఏకాదశికి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తజన సందోహం.
జమ్మికుంట టౌన్ జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు):
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, దివ్య అలంకరణలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పరవశానికి లోనయ్యారు.
పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి క్యూ లైన్లలో క్రమశిక్షణతో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంతో దర్శనం ప్రశాంతంగా కొనసాగింది.


Comments