ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
*ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ హరితహారం లక్ష్యంగా కౌన్సిలర్ సొల్లు సునీత*
హుజురాబాద్, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సంకల్పంతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో శుక్రవారం విస్తృత స్థాయిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదవ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ, రజకవాడ, గౌడ సంఘం కాలనీ, మాల సంఘం కాలనీతో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీల్లో ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటి వాటి సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని చెట్టుగా పెంచాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన వాతావరణాన్ని భావితరాలకు అందించవచ్చని కౌన్సిలర్ సొల్లు సునీత పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె అన్నారు.
వనమహోత్సవ కార్యక్రమం ద్వారా హుజురాబాద్ పట్టణాన్ని మరింత హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి దానికి నిరంతరం నీరు పోస్తూ సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం లక్ష్యాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ గుడి చైర్మన్ కొలిపాక శంకర్, కొండపాక భూపాల్, గాధం భాగ్యలక్ష్మి, వడ్డెర కాలనీ వాసులు, రజకవాడ, గౌడ సంఘం కాలనీ, మాల సంఘం కాలనీ ప్రజలు, యువకులు, మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.


Comments