గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
* వందల మందికి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ..
* మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన
ఇల్లంతకుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్య బృందం సేవలందించి వందలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది.
శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్య–రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేని ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తగిన మోతాదులో మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలని, శరీరంలో నీటి కొరత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని సూచించారు.
హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యంపైనా సమాన శ్రద్ధ చూపాలని కోరారు. గర్భాశయ సంబంధిత సమస్యలు, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణపై మహిళలకు అవగాహన కల్పించారు.
కారోబర్ తిప్పారపు వీరన్న మాట్లాడుతూ, గ్రామ మహిళలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను వైద్యులు ఓర్పుగా విని తగిన సూచనలు, సలహాలు అందించారని తెలిపారు. శిబిరంలో షుగర్, రక్తపోటు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు సుమలత, స్వాతి, ఆసియా, హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంకీర్తన, పీఆర్వో బిక్షపతి, సంపత్ రెడ్డి, రాజేష్, సిబ్బంది ప్రసన్న, భారతి, కృష్ణవేణి, గ్రామ ఉపసర్పంచ్ ఇంగ్లే లక్ష్మయ్య, గ్రామ కార్యదర్శి సుమలత, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి గొడుగు మానసతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments