భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.
వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లాస్మక్కపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తనపై, తన భార్య గెల్లు రజితపై దాడి చేశారని అదే గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు.
గెల్లు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తాము సాగు చేస్తున్న భూమిని ఇటీవల దున్నకుండా అడ్డుకోవడంతో వీణవంక పోలీసులను ఆశ్రయించామని, అనంతరం న్యాయస్థానం నుంచి ఇంజక్షన్ ఆర్డర్ పొందిన తర్వాత సంబంధిత వారికి నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. అనంతరం పొలానికి వెళ్లి దున్నే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసిందన్నారు.
ఈ క్రమంలో తనపై దాడి జరుగుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన తన భార్య గెల్లు రజితను తోసివేయడంతో ఆమె కాలుకు గాయమైందని ఆరోపించారు. వెంటనే వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ దంపతులు ఆరోపించారు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయపరమైన మార్గంలో వెళ్తున్న తమకు పోలీసులు రక్షణ కల్పించి, నిష్పాక్షికంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ ఘటనపై మరో పక్షం స్పందన తెలియాల్సి ఉంది. పోలీసులు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సమాచారం.


Comments