బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి ముగ్గురు సర్పంచ్లు.
ఇల్లంతకుంట,ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి చెందిన ముగ్గురు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్ నందినగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్–శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్–మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా చేరిన సర్పంచ్లు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, బీజేపీ కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శించారు.
గ్రామస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలపై అసంతృప్తి పెరుగుతోందని, దీంతో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని, ఆయన నాయకత్వంపై విశ్వాసంతోనే తాము బీఆర్ఎస్లో చేరినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments