ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాటలో సీపీఐ
ఎల్కతుర్తి ఆగస్టు04 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోసం సీపీఐ పోరుబాట పట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మునిగాల భిక్షపతి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పాదయాత్రల సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య, దెబ్బతిన్న రహదారులు, ఉపాధి హామీ పనుల అమలు, సాగునీటి ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పాదయాత్రను ఈనెల 6న కాజీపేట మండల కేంద్రంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈనెల 14న పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని వ్యవసాయ కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాసంఘాల నాయకులు, సీపీఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రలను విజయవంతం చేయాలని కర్రే లక్ష్మణ్, మునిగాల భిక్షపతి విజ్ఞప్తి చేశారు.


Comments