వాయిదా పడిన పరీక్షలకు వెంటనే కొత్త షెడ్యూల్ ఇవ్వాలి.
జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన గట్టు మన్నెం.
వనపర్తి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వాయిదా పడిన మధ్యంతర పరీక్షలకు వెంటనే కొత్త షెడ్యూల్ విడుదల చేసి, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు, మోజెర్ల మాజీ సర్పంచ్ గట్టు మన్నెం కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గట్టు మన్నెం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు జరగాల్సిన మధ్యంతర పరీక్షలు కొందరి నిరసనలు, పరీక్షల బహిష్కరణకు పిలుపు నేపథ్యంలో వాయిదా పడ్డాయని తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరారు. పరీక్షలను బహిష్కరించాలనుకునే విద్యార్థులు తమ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని, అయితే ఇతర విద్యార్థులను అడ్డుకోవడం, బెదిరించడం, బలవంతం చేయడం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97పై విద్యార్థులకు ఉన్న అభ్యంతరాలను సంబంధిత ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి శాంతియుతంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను వెంటనే ప్రకటించి, పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం అందించాలని గట్టు మన్నెం విజ్ఞప్తి చేశారు.


Comments