స్టేషన్ ఘన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వాణిశ్రీ
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వాణిశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులు, ప్రయోగశాల నమోదు పుస్తకాలు, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.జ్వరంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి తప్పనిసరిగా ప్రయోగశాల పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో వైద్యాధికారి డా. శ్రీవాణి, ఆర్బీఎస్కే వైద్యాధికారి డా. అజయ్ కుమార్, సామాజిక ఆరోగ్య అధికారి జయపాల్ రెడ్డి, ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు రాజేష్, ఔషధ విక్రేత, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.


Comments