తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల విధానం ప్రపంచానికే ఆదర్శం.
ధర్మసాగర్ కేజీబీవీని సందర్శించిన తుర్కియే దేశ ప్రతినిధులు.
ధర్మసాగర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
భారత విద్యారంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన తుర్కియే దేశ ప్రతినిధులు మసూద్ ఓనర్, నూరుల్లా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటశాల, కంప్యూటర్ ప్రయోగశాల, విజ్ఞాన ప్రయోగశాల, గ్రంథాల
యాలను పరిశీలించారు.పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా విధానం, బోధనా పద్ధతులు, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీనియర్ ఇంటర్ విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల ప్రత్యేక అధికారి మాధవితో ప్రతినిధులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న నివాస విద్యా విధానం పట్ల తుర్కియే దేశ ప్రతినిధులు ప్రశంసలు వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలను అందిస్తూ సమగ్ర విద్యను అందిస్తున్న విధానం తమను ఆకట్టుకుందని తెలిపారు. ఇలాంటి నివాస విద్యా విధానాన్ని తమ దేశంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, జిల్లా బాలికా విద్యాధికారి సునీత, మండల విద్యాధికారి శ్రీదేవి తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలను ప్రతినిధులకు వివరించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలు, నోటు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ అధ్యక్షుడు అశ్వినీ కుమార్, ప్రధాన కార్యదర్శి సి.ఎల్. రోజ్, కార్యనిర్వహణ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రతినిధులు చిత్తలూరి ప్రసాద్, త్రివేణి, విజయలక్ష్మి, గీత, పాలిటెక్నిక్ అధ్యాపకురాలు రజితా రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఫలిత శ్రీహరి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల ఉపేందర్ రెడ్డి, మహబూబాబాద్ అధ్యక్షుడు మిర్యాల సతీష్, ధర్మసాగర్ మండల శాఖ అధ్యక్షుడు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి జాన్ సింగ్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.


Comments