నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం
* మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు
జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ అలాం అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి ప్రధాన వేదికగా ఉన్న నాయిని చెరువును ఆయన పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, వేగవంతంగా పూర్తయ్యేలా మూడు క్రేన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాకపోకలు, నిమజ్జన ప్రక్రియను సమన్వయంతో నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.
గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా నాయిని చెరువు వద్ద భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ బందోబస్తు, ఇతర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
గణేష్ మండపాల నిర్వాహకులు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ మరియు ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు కోరారు. భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐలు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 


Comments