సర్పంచ్ ఎన్నికలలో బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు 56% సీట్లు ఇవ్వాలి
తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయకుమార్
హైదరాబాద్,నవంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
సికింద్రాబాద్ రేజిమెంటల్ బజార్లో తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బిసిలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. టీచర్–సామాజిక కార్యకర్త–కంటెస్టెడ్ ఎమ్మెల్యే సంఘం రాష్ట్ర నాయకులు నందికంటి సాయికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్, భజప, బిఆర్ఎస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు కనీసం 56 శాతం స్థానాలు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిసిల జనాభా 56 శాతం ఉందని ప్రభుత్వం బిసి కులగణన అనంతరం అధికారికంగా ప్రకటించినప్పటికీ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల రూపంలో ఆ అనుపాతం ప్రతిబింబించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన కామారెడ్డి ప్రకటనలో స్థానిక సంస్థలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాటలు అమలు కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిసిలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలూ 56 శాతం స్థాయిలో సీట్ల కేటాయింపు చేపడితేనే బిసిలకు సరైన రాజ్యాధికారం లభిస్తుందని అన్నారు.ఈ సమావేశంలో దొడ్ల శ్రీనివాస్ నాయి, మండలి జశ్వంత్ ముదిరాజ్, దొడ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments