బీసీల యుద్ధభేరి సభను విజయవంతం చేద్దాం
వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
వరంగల్,నవంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా తగ్గించి బీసీలను రాజకీయంగా అంచున నిలబెట్టేందుకు కాంగ్రెస్, భాజపా పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని బీసీ జేఏసీ వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ విమర్శించారు. నర్సంపేటలో జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల జనాభా అరవై శాతం ఉన్నప్పటికీ కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లే అమలులో ఉన్నాయన్నారు.
జీవో 46 అమలుతో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 276 సర్పంచ్ స్థానాలే బీసీలకు కేటాయించబడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వేలకు పైగా ఉన్న బీసీ సర్పంచ్ స్థానాలు గండికొట్టబడి సాధారణ స్థానాలుగా మారిపోయాయని, దీంతో గ్రామస్థాయి నుంచే అధిపత్య కులాల ఆధిపత్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ముప్పై మండలాల్లో ఒక్క గ్రామపంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదని, మరో ఎనభై మండలాల్లో మాత్రం అరుదుగా ఒకటి రెండు స్థానాలకే పరిమితమైపోయాయని ఆయన తెలిపారు.
కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయ విధానాలను తిప్పికొట్టేందుకు బీసీలు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ పిలుపు మేరకు ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్లో నిర్వహించే “బీసీల రాజకీయ యుద్ధభేరి సభ”ను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు పెద్దఎత్తున సమీకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో చెన్నూరు రవి ముదిరాజ్, కడారి సురేష్ యాదవ్, బుర్ర సుదర్శన్, మద్దెల శ్యాం కుమార్ యాదవ్, గోపగాని నాగరాజ్, బండి విజయ, గాండ్ల శ్రీనివాస్, మారపాక రమేష్, మద్దెల కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments