సత్తుపల్లిలోఎమ్మెల్యే రాగమయి విస్తృత పర్యటన.
- ప్రజా సమస్యలపై ప్రత్యక్ష స్పందన.
- సీఎం కప్ క్రీడలకు ఘన ప్రారంభం.
సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణం, మండలంలో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణం 6వ వార్డులో మాజీ వైస్చైర్మన్ తోట సుజలారాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డులోని వివిధ కాలనీల్లో నివసిస్తున్న ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాధురి ఫంక్షన్ హాల్ సమీపంలోని రహదారి, రాజ బాపయ్య హాస్పిటల్ రోడ్డు ప్రాంతాల్లోని రహదారులు, డ్రైనేజీలు, భవనాలకు ఆనుకుని ఉన్న విద్యుత్ లైన్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అలాగే చింతలపాటి రోడ్డులో నివసిస్తున్న వంగ శ్రీనును అనారోగ్య కారణంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కిష్టారం, చెరుకుపల్లి, యాతలకుంట గ్రామాల పాఠశాల క్రీడాకారులతో కలిసి నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే రాగమయి ప్రారంభించారు. వాలీబాల్ పోటీలకు టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆట ఆడారు.
అలాగే రుద్రాక్షపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి, బుగ్గపాడు, రేగళ్లపాడు గ్రామాల పాఠశాల క్రీడాకారులతో కలిపి నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించి టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రెండు కార్యక్రమాల్లో మాట్లాడుతూ పల్లెల నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలన్న లక్ష్యంతో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు.


Comments