లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 800 రోజులకు చేరిన ‘మీల్స్ ఆన్ వీల్స్’
సత్తుపల్లి, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా సత్తుపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మీల్స్ ఆన్ వీల్స్’ కార్యక్రమం మంగళవారం నాటికి 800 రోజులకు చేరింది. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి, బస్టాండ్ కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకల్లా సుమారు 150 మందికి అల్పాహారం అందిస్తూ ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమం 800వ రోజు సందర్భంగా సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, సమయపాలనతో ప్రతిరోజు ఉదయం కేపీఆర్ గౌతమ్ స్కూల్లో అల్పాహారం వండించి, ప్రత్యేక వాహనం ద్వారా యాచకులు, రోగులు, వృద్ధులు, నిరుపేదలకు సకాలంలో వడ్డించడం అభినందనీయమన్నారు. పేదల ఆకలి మంటలను ఆర్పే ఈ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, బస్టాండ్ కేంద్రంలో యాచకులు, వృద్ధులు, నిరుపేదలకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పాహారం అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవికుమార్, మందపాటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరరావు, లైన్స్ క్లబ్ బాధ్యులు కొత్తూరు సత్యనారాయణ, దొడ్డ కృష్ణయ్య, చెన్నారెడ్డి, పెనుగొండ రమేష్, రమణ, సలీం, శ్రీను, వలి, యూనిస్, పాషా తదితరులు పాల్గొన్నారు.


Comments