ఎల్కతుర్తి మండలంలోని గ్రామాల్లో నిద్రిస్తున్న నిఘా నేత్రాలు
పనిచేయని సీసీ కెమెరాలతో భద్రత ప్రశ్నార్థకం
ఎల్కతుర్తి, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో గ్రామాల్లో భద్రత తీవ్రంగా దెబ్బతింటోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా నేత్రాలుగా భావించే సీసీ కెమెరాలు నిర్వీర్యంగా మారడంతో దొంగతనాలకు అడ్డుకట్ట పడడం లేదని వారు వాపోతున్నారు.
ఇటీవల మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆవులు, గేదెల దొంగతనాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. అయితే కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బావిలకాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసి ఉంటే దొంగల ఆచూకీ సులభంగా లభించేదని వారు అభిప్రాయపడ్డారు.
సీసీ కెమెరాల నిర్వహణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని, ఇది దొంగలకు వరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సర్పంచులు లేకపోవడం వల్ల ఈ సమస్యపై సరైన స్పందన రాలేదని వారు తెలిపారు.
ఇకనైనా నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధితో పాటు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి, పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు
చేయించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోతే గ్రామాల్లో భద్రత మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


Comments